'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:07 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. అయితే స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా క్రికెట్లో కొన్ని జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి మ్యాచులకూ మైదానాలు ఫుల్ అవుతుంటాయి. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే.. స్టేడియం కిక్కిరిసి పోతుంది. ఈ రెండు జట్ల మధ్య క్రీడా వైరమే అందుకు కారణమని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దోశ, ఇడ్లీ అనే పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ డీజే ప్లే చేశారు. ఈ పాటపై చెన్నై జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారని బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు చేసింది. స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొంది.
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ..' సాధారణంగా డీజేలు హోమ్ టీమ్కు మద్దతుగా ఉంటారు. ఆ విషయాన్ని మేము తప్పుగా భావించడం లేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇడ్లీ, దోశ అనే పాటను ప్లే చేస్తూ మా ఆటగాళ్లను డీజే కించపరిచాడు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ విషయం పై మేము బీసీసీఐకి లేఖ రాశాం" అని తెలిపాడు.
2025 నుంచే 'దోశ, ఇడ్లీ' పాట వివాదం నడుస్తోంది. గత సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ జితేశ్ శర్మ ఈ పాట పాడటంపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. అప్పట్లో చెపాక్ స్టేడియంలో జితేశ్ ఔటైనప్పుడు అదే పాటను ప్లే చేసి సీఎస్కే డీజే సభ్యులు బదులిచ్చారు. కానీ వారి మేనెజ్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యర్థి ఆటగాళ్లను టార్గెట్గా చేసుకుని కించపరచొద్దని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ పాట వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ లో చాలా కాలం చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రాంతీయ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి తారుమారైంది. 2024 నుంచి ఇటీవలి మ్యాచ్తో కలిపి సీఎస్కేపై ఆర్సీబీ వరుసగా నాలుగు మ్యాచ్లను గెలిచింది.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ