Share News

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ వైదొలిగితే.. యువ పేసర్లకు బీసీసీఐ ఛాన్స్!

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:48 AM

భారత టెస్టు జట్టులో కొత్త పేస్ దళాన్ని తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ వైదొలిగితే.. యువ పేసర్లకు బీసీసీఐ ఛాన్స్!
BCCI

ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు జట్టులో కొత్త పేస్ దళాన్ని తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుమ్రానే ప్రధాన అస్త్రంగా కొనసాగించినప్పటికీ.. అతడిపై ఎక్కువగా ఆధారపడకుండా భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ పేసర్లను సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి భారత్ వైదొలిగితే.. బీసీసీఐ ముగ్గురు యువ పేసర్లను బరిలోకి దింపే అవకాశం ఉంది.


బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత జట్టులో నమ్మకమైన పేసర్‌గా ఉన్నప్పటికీ.. వీరిద్దరి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించే వేగవంతమైన బౌలర్ల కొరత కనిపిస్తోందని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు గాయం నుంచి కోలుకుని రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించిన భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇవ్వడం లేదు. అతడు ఇక భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో లేకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేగంతో పాటు బౌన్స్ రాబట్టగల పేసర్లపై బీసీసీఐ దృష్టి సారించింది. తుషార్ దేశ్‌పాండే, గుర్జాప్‌నీత్ సింగ్, విదర్భ పేసర్ నచికేత్ భూటే ప్రదర్శనను సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ వైదొలిగితే.. ఈ యువ పేసర్లకు వెంటనే జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


సరికొత్త ప్రయోగం!

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7-8 విజయాలు సాధిస్తేనే ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. ఆగస్టు 7 నుంచి శ్రీలంకతో టెస్టు, అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ రెండు పర్యటనల్లోనే టీమిండియా డబ్ల్యూటీసీ భవితవ్యం తెలిసిపోతుంది. 2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రాపై భారత్ ఎంతగా ఆధారపడిందో స్పష్టంగా కనిపించింది. అతడు వికెట్లు తీయలేని సందర్భాల్లో భారత బౌలింగ్ ప్రభావం తగ్గిపోయింది. ఇంగ్లండ్ పర్యటనలో కూడా బుమ్రా అన్ని టెస్టులకు దూరమవడంతో పేస్ విభాగంలో లోటు స్పష్టమైంది. ఎడమచేతి పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అంశుల్ కాంబోజ్‌ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌కు ఆకిబ్ నబీకి అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త పేసర్లను పరీక్షించే ప్రక్రియను బీసీసీఐ కొనసాగిస్తోంది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ కెప్టెన్‌గా కన్హయ్య వాధ్వాన్.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్

Updated Date - Aug 04 , 2026 | 11:49 AM