Share News

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:45 AM

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గురించి మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక్కసారి మాత్రమే రాహుల్‌ కోపంగా ఉండటం చూశానని తెలిపాడు.

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్
Wasim Jaffer

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గురించి మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక్కసారి మాత్రమే రాహుల్‌ కోపంగా ఉండటం చూశానని తెలిపాడు. అతడు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడని.. ఆ ఒక్కసారి మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు వెల్లడించాడు. గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకోవడం రాహుల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు. ఈ క్రమంలో వసీం జాఫర్ ఓ క్రికెట్ షోలో మాట్లాడాడు.


‘కేఎల్ రాహుల్ చాలా కూల్‌గా ఉంటాడు. మైదానంలోనూ, బయటా కోపం చూపించడం చాలా అరుదు. కానీ నేను పంజాబ్ కింగ్స్‌లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో గెలవాల్సిన మ్యాచ్‌లను చివరి ఓవర్లలో కోల్పోయాం. ఒక మ్యాచ్ ఓడిన తర్వాత అతడు నిజంగానే తీవ్ర అసహనానికి గురయ్యాడు. హద్దులు దాటి ఏమీ మాట్లాడలేదు. కానీ జట్టు ఆటతీరుపై ఎంత నిరాశ చెందాడో అతడి ముఖంలో కనిపించింది. రాహుల్‌ను కోపంగా చూసిన ఏకైక సందర్భం అదే’ అని వసీం జాఫర్ వెల్లడించాడు.


కేఎల్ రాహుల్ 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2020లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నప్పటికీ, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. 2020, 2021 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో స్వల్ప తేడాతో ఓడిన మ్యాచ్‌లు పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీశాయి. పంజాబ్ తరఫున రాహుల్ 55 మ్యాచ్‌ల్లో 2,548 పరుగులు చేసి ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అనంతరం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ఆడిన అతడు, 2025 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మరోసారి దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 2026 సీజన్‌లో 593 పరుగులు చేసి, ఐపీఎల్‌లో భారత బ్యాటర్‌గా తొలి 150+ స్కోరు (152*) నమోదు చేసి మరో అరుదైన ఘనత సాధించాడు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ కెప్టెన్‌గా కన్హయ్య వాధ్వాన్.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్

Updated Date - Aug 04 , 2026 | 10:45 AM