శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్మన్ గిల్ గాయంపై స్పందించిన బీసీసీఐ
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:46 AM
భారత జట్టు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు.. టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టును గాయాల సమస్య వెంటాడుతోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరం కాగా.. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి సమస్య కారణంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు.. టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.
ఇప్పుడు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో గిల్ బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా పేర్కొంది. ‘ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ కుడి చేతి బొటనవేలికి గాయమైంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో వార్మప్ మ్యాచ్ తొలి రోజు గిల్ మైదానంలోకి దిగడు. అతడికి బదులు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. బీసీసీఐ వైద్య బృందం గిల్ గాయంపై పర్యవేక్షిస్తోంది’ అని బీసీసీఐ తెలిపింది.
అదే కీలకం: దీప్ దాస్గుప్తా
ఈ పరిస్థితులపై భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక సిరీస్కు ముందు భారత జట్టుకు లభించిన సుదీర్ఘ విరామం అత్యుత్తమ సన్నద్ధతకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ‘నా అభిప్రాయం ప్రకారం.. శ్రీలంక సిరీస్కు ముందు టీమిండియాకు లభించిన సమయం అద్భుతమైన సన్నద్ధతకు అవకాశం. అయితే ఈ సమయాన్ని జట్టు ఎలా ఉపయోగించుకుంటుందనేది కీలకం. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పోలిస్తే అప్పటి సన్నాహకాలు అంతగా లేవు. ఆటగాళ్లు గాయపడటం, అందుబాటులో లేకపోవడంతో అప్పట్లో పరిస్థితులను చక్కదిద్దడంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. కోచ్గా జట్టును సిద్ధం చేయడం కూడా కష్టమయ్యేది. ఒకసారి తుది జట్టును ఎంపిక చేస్తే.. వెంటనే ఎవరో ఒకరు గాయపడేవారు. దాంతో మళ్లీ జట్టులో మార్పులు చేయాల్సి వచ్చేది. ఒక సిరీస్కు ముందు భారత్కు పది రోజుల సమయం లభించడం అరుదు. ఈ విరామాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకోవాలి. గాయపడిన ప్లేయర్లు తిరిగి కోలుకోవడానికి కూడా ఇదొక మంచి అవకాశం’ అని దాస్గుప్తా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద
శ్రీలంక సిరీస్లో భారత్కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?