Share News

ఆసియా క్రీడలు: ‘బి’ టీమ్‌తో బరిలోకి భారత్.. ఆ పుకార్లకు బీసీసీఐ చెక్!

ABN , Publish Date - Aug 28 , 2026 | 07:49 PM

జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు ‘బి’ టీమ్‌తో బరిలోకి దిగనుందన్న వార్తలకు బీసీసీఐ చెక్‌ పెట్టింది. ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఆసియా క్రీడలు: ‘బి’ టీమ్‌తో బరిలోకి భారత్.. ఆ పుకార్లకు బీసీసీఐ చెక్!
Asian Games 2026

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు ‘బి’ టీమ్‌తో బరిలోకి దిగనుందన్న వార్తలకు బీసీసీఐ చెక్‌ పెట్టింది. ఐచి-నగోయాలో క్రికెటర్ల కోసం చేసిన ఏర్పాట్లపై ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఈ కారణంగా ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


జపాన్‌లోని క్రికెట్‌ వేదికలు, ఆటగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై బీసీసీఐ, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితులను పరిశీలించేందుకు బీసీసీఐ ఓ పరిశీలకుడిని పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏర్పాట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఆసియా క్రీడలకు ‘బి’ టీమ్‌ను పంపే అంశాన్ని పరిశీలించవచ్చని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు ఓ వార్త కథనం వెల్లడించింది. దీంతో ఈ పుకార్లు జోరందుకున్నాయి. తాజాగా పరిణామంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది.


టెంట్లలో డ్రెస్సింగ్‌ రూమ్‌లు..

ఆసియా క్రీడల క్రికెట్‌ వేదిక వద్ద డ్రెస్సింగ్‌ రూమ్‌లను టెంట్లలో ఏర్పాటు చేశారని.. వాటి నుంచి వాష్‌రూమ్‌లు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నాయని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆటగాళ్లకు కేటాయించిన హోటల్‌ గదులు కూడా చాలా చిన్నగా ఉన్నాయని బోర్డు ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాలను ఏసీసీ సమావేశంలో జపాన్‌ ఒలింపిక్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


ఆసియా కప్ ఎవరిదో?

2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడంతో మెరుగైన సీడింగ్‌ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈసారి కూడా బీసీసీఐ పూర్తి స్థాయి జట్టును ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి స్టార్‌ పేసర్లతో పాటు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, వైభవ్‌ సూర్యవంశీ, తిలక్‌ వర్మ వంటి బ్యాటర్లు జట్టులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Updated Date - Aug 28 , 2026 | 07:49 PM