మేఘాల్లో ఆతిథ్యం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:35 PM
మేఘాలలో తేలియాడుతూ కాఫీ సిప్ చేయొచ్చు. మేఘాల నుంచి సూర్యోదయం చూడొచ్చు. నిజంగానే మరోలోకంలో... అచ్చంగా స్వర్గలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమనేగా మీ డౌటు...?
మేఘాలలో తేలియాడుతూ కాఫీ సిప్ చేయొచ్చు. మేఘాల నుంచి సూర్యోదయం చూడొచ్చు. నిజంగానే మరోలోకంలో... అచ్చంగా స్వర్గలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమనేగా మీ డౌటు...?
హోటల్కు వెళ్లాలంటే బైక్పైనో లేక కారులోనో వెళతాం. కుదరకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటాం. అయితే ఇటలీ, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్న ఒక హోటల్ను చేరుకోవాలంటే మాత్రం పెద్ద సాహసమే చేయాలి. కేబుల్కార్లు ఎక్కాల్సి ఉంటుంది. హిమానీ నదులు దాటాల్సి ఉంటుంది. చివరగా ఐదు కిలోమీటర్లు పర్వత శ్రేణుల్లో ట్రెక్కింగ్ చేస్తే గానీ సదరు హోటల్కి చేరుకోలేం. అదే ‘మార్గరీటా హట్’. ఇటాలియన్ ఆల్ఫ్స్ పర్వతాల్లోని మోంటెరోసాలోని సిగ్నల్కుప్పే శిఖరంపై ఉంటుందీ హోటల్. యూరప్లో అతి ఎత్తైన హోటల్గా దీనికి గుర్తింపు ఉంది. దీనిని 1893లో నిర్మించారు.
సూర్యోదయం చూసి తీరాల్సిందే...
ఈ హోటల్ చేరుకోవడం అంత సులువేం కాదు. వేసవిలో వాతావరణ పరిస్థితులు పర్వాలేదు కానీ, చలికాలంలో మాత్రం సామాన్యులు కాకుండా... పర్వతారోహకులు మాత్రమే అక్కడికి చేరుకోగలుగుతారు. అయితే ఒక్కసారి హోటల్కి చేరుకుంటే... ట్రెక్కింగ్ తాలూకు అలసటంతా క్షణాల్లో దూరమవుతుంది. ‘మార్గరీటా హట్’లో బస చేస్తే ఆ జ్ఞాపకాలు జీవితాంతం పదిలంగా ఉండిపోతాయి. ఇది సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. హోటల్లో కూర్చుంటే మేఘాల మధ్యలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. హోటల్లో నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు చూసి తీరాల్సిందే. ఎటుచూసినా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలతో ఆ ప్రాంతమంతా అత్యంత రమణీయంగా ఉంటుంది.
హోటల్లో 70 మంది బస చేయొచ్చు. అందరికీ సరిపడా వసతి సదుపాయాలు ఉంటాయి. బయట ఎటు చూసినా మంచుతో గడ్డకట్టే చలి ఉన్నా, హోటల్లో మాత్రం వెచ్చగా ఉంటుంది. ట్రెక్కింగ్ను ఇష్టపడేవారు, పర్వత ప్రేమికులు ఈ హోటల్లో బస చేయడానికి ఇష్టపడుతుంటారు. వేసవిలో అతిథులతో బిజీగా ఉంటుంది. చలికాలంలో మాత్రం హోటల్ పూర్తి స్థాయిలో పనిచేయదు. కేవలం 12 మందికి వసతి సదుపాయాలు లభిస్తాయి. చలికాలంలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి.
అనుభవజ్ఞులైన పర్వతారోహకులు మాత్రమే హోటల్ను సందర్శించ గలుగుతారు. ఇందులో బస చేయాలంటే రోజుకు సుమారు రూ. 15 వేలు ఛార్జ్ చేస్తారు. బెడ్, బ్రేక్ఫాస్ట్ అందిస్తారు. హాఫ్ బోర్డ్ ఆప్షన్లో డిన్నర్, రాత్రుళ్లు బస, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, ఫ్రీ వైఫై సదుపాయాలు ఉంటాయి. ఇందుకోసం సుమారు రూ.17 వేలు వసూలు చేస్తారు. అయితే బస చేసినవారు మాత్రం ‘ఇది చాలా తక్కువే’ అంటారు. మేఘాల్లో హోటల్ అంటే మాటలా మరి.
ఈ వార్తలు కూడా చదవండి:
జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
Read Latest Telangana News and National News