Share News

చందమామ ‘చిన్న’బోతోంది

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:26 AM

చందమామ చిన్నబోతోంది. ఎక్కడికక్కడ పగుళ్లతో బక్కచిక్కిపోతోంది. చుక్కల రేడుకి ఇంత కష్టం ఎందుకంటే.. అక్కడ సంభవించే చంద్రకంపాలే కారణం అని పరిశోధకులు...

చందమామ ‘చిన్న’బోతోంది

  • ఉపరితలంపై కొత్తగా 1,114 పగుళ్లు

  • వాటితో కుంచించుకుపోతున్న జాబిల్లి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: చందమామ చిన్నబోతోంది. ఎక్కడికక్కడ పగుళ్లతో బక్కచిక్కిపోతోంది. చుక్కల రేడుకి ఇంత కష్టం ఎందుకంటే.. అక్కడ సంభవించే చంద్రకంపాలే కారణం అని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రకంపాలు సాధారణమే అయినా, వాటితో ఏర్పడుతున్న పగుళ్లే జాబిల్లి కుంచించుకుపోవడానికి కారణం అంటున్నారు. చంద్రుడి ఉపరితలంపై తాజాగా మరిన్ని పగుళ్లు కనిపిస్తున్నాయని నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియంకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ స్టడీస్‌ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పగుళ్ల కారణంగా చందమామ కుంచించుకుపోతోందని వారు వెల్లడించారు. చంద్రుడి అంతర్భాగం చల్లగా అయిపోతుండటం వల్ల ఇలా జరుగుతోందన్నారు. అయితే జాబిల్లిపై పగుళ్ల విషయం మన శాస్త్రవేత్తలకు 2010 నుంచి తెలుసు. అప్పట్లో చంద్రుడిపైన ఎత్తైన ప్రాంతాల్లోనే ఈ పగుళ్లను గుర్తించారు. కానీ ఇప్పుడు లూనార్‌ మారియా అనే మరో ప్రాంతాల్లో పగుళ్లు కనబడ్డాయి. ఈ ప్రాంతం పురాతన అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఏర్పడింది. ఈ విస్ఫోటం జాబిల్లి ఉపరితలంపై పెద్ద, చీకటి, బసాల్ట్‌ మైదానాన్ని సృష్టించింది. చంద్రుడి అంతర్భాగంలో ఒత్తిడి వల్ల పైకి ఉబికి వచ్చిన పదార్థంతో ఎత్తైన ప్రాంతాల్లో లొబాటే స్కార్ప్స్‌ అనే రూపాలు ఉద్భవించాయి. అయితే అలాంటి పక్రియతోనే లూనార్‌ మారియా ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో ఏర్పడిన పగుళ్లను శాస్త్రవేత్తలు స్మాల్‌ మేర్‌ రిడ్జెస్‌ (ఎస్‌ఎంఆర్‌) అని పిలుస్తున్నారు. చంద్రుడిపై ఈ కొత్త అధ్యయనానికి నేతృత్వం వహించిన కోల్‌ నైపావెర్‌ మాట్లాడుతూ ‘‘అపోలో శకం నుంచి చంద్రుడిపై ఎత్తైన ప్రాంతాల్లోని లొబాటే స్కార్ప్స్‌ గురించి మాకు తెలుసు. కానీ జాబిల్లి ఉపరితలం అంతా విస్తృతంగా కనిపిస్తున్న లూనార్‌ మేర్‌లను ఇప్పుడే శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు’’ అని చెప్పారు. ఇలాంటి 1,114 ఎస్‌ఎంఆర్‌లను కనుగొన్నారు. వీటితో మొత్తం పగుళ్ల సంఖ్య 2,634కు చేరింది. ఇంకో విశేషం ఏమిటంటే.. లొబాటే స్కార్ప్స్‌ కన్నా, ఎస్‌ఎంఆర్‌లు పురాతనమైనవి.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:26 AM