'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:47 PM
బెంగాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సర్' ప్రక్రియకు అడ్డంకులు కల్పించే ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: బెంగాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సర్' ప్రక్రియకు అడ్డంకులు కల్పించే ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఏదైనా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే తామే కల్పించుకుంటామని తెలిపింది. పశ్చిమబెంగాల్లో 'సర్' ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకూ మరో వారం పొడిగిస్తున్నట్టు పేర్కొంది.
'ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే మేమే జారీ చేస్తాం. అంతేకానీ సర్ ప్రక్రియను అడ్డుకోవడాన్ని మాత్రం అనుమతించం. అన్ని రాష్ట్రాలు దీన్ని అర్థం చేసుకోవాలి' అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో 8,500 మంది ఆఫీసర్లు పాల్గొంటున్నట్టు విచారణ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే తాము ఆమోదించి ఉండేవాళ్లమన్నారు. మైక్రో-అబ్జర్వర్ల స్థానంలో ఉపయోగించుకుంటున్న 8,000 మంది గ్రూప్-బి ఆధికారుల పేర్లు పంపడంలో ఎందుకు జాప్యం జరిగిందని బెంగాల్ ప్రభుత్వాన్ని సీజేఐ ప్రశ్నించారు. ఫిబ్రవరి 4న తాము ఆదేశాలిస్తే ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎందుకు పంపించలేదని మమతాబెనర్జీని ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదన వినిపిస్తూ, ఎన్నికల కమిషన్ ఎప్పుడూ బి-గ్రూప్ ఆఫీసర్లను అడగలేదని, అలాంటి రిక్వెస్ట్ కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పారు. ఓటర్ల స్థానికతను నిరూపించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇవ్వడం లేదని బెంగాల్ ప్రభుత్వ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. దీంతో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ఎన్నికల తుది జాబితా గడువును మరో వారం రోజుల పాటు (ఫిబ్రవరి 21 వరకూ) పొడిగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం
లా కాలేజీలో దారుణం.. క్లాస్ రూములో యువతిపై కాల్పులు..