Share News

మల్టీ నేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు.. ఆరుగురి అరెస్టు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:20 PM

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

మల్టీ నేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు.. ఆరుగురి అరెస్టు..
Harassment in Multi-National Company

ముంబై: ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినిలపై తోటి ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడడం సంచలనం రేపుతోంది. యువతులను పదే పదే తాకడం, వారిపై అత్యాచారానికి పాల్పడడం వంటి విషయాలు బహుళజాతి సంస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు మెుత్తం 9 కేసులు నమోదు చేసి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. బాస్ పట్టించుకోకపోగా.. వారి చర్యలకు పరోక్షంగా సహకరించాడు. దీంతో తోటి ఉద్యోగుల వికృత చేష్టలు మరింత తీవ్రమయ్యాయి. యువతులను పదేపదే శారీరకంగా తాకుతూ ఇబ్బందులు పెట్టారు. నిందితుల్లో ఒకరు ఓ మహిళా ఉద్యోగినిని వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


అలాగే మరో మహిళను అసభ్యకరంగా తాకి ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితంపైనా అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. బాధితురాలి శారీరక రూపంపైనా దారుణ వ్యాఖ్యలు చేశాడు. నిందితులు పురుష ఉద్యోగులపైనా మాటల దాడి చేసేవారు. మతపరమైన విషయాల్లోనూ అవమానకరంగా మాట్లాడేవారు. వారి వేధింపులు తాళలేక నాసిక్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మెుత్తం 9 కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఈరోజు వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 10 వరకు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం.


మరొకరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ ఆదేశాల మేరకు ఏసీపీ సందీప్ మిట్కే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటయ్యింది. వేధింపులకు గురైన ఇతర ఉద్యోగులు సైతం ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన బహుళజాతి సంస్థల్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

భారీ ఫాలోయింగ్, విలాసవంత జీవితం.. దుబాయ్‌లో అరెస్టైన భారతీయ గ్యాంగ్‌స్టర్..

మేదినీపూర్, నందిగ్రామ్ బాటలోనే బెంగాల్‌ అంతా హల్దియా సభలో ప్రధాని మోదీ

Updated Date - Apr 09 , 2026 | 05:31 PM