Share News

భారీ ఫాలోయింగ్, విలాసవంత జీవితం.. దుబాయ్‌లో అరెస్టైన భారతీయ గ్యాంగ్‌స్టర్..

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:42 PM

రెండేళ్ల క్రితం హర్యానాలో ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత దేశం విడిచి పారిపోయిన భారతీయ గ్యాంగ్‌స్టర్ రావు ఇందర్‌జీత్ యాదవ్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు. ఇందర్‌జీత్‌కు సంబంధించిన పత్రాలను దుబాయ్ అధికారులు కోరారని, అతడిని అతి త్వరలో భారత్‌కు అప్పగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

భారీ ఫాలోయింగ్, విలాసవంత జీవితం.. దుబాయ్‌లో అరెస్టైన భారతీయ గ్యాంగ్‌స్టర్..
Rao Inderjeet Yadav arrest Dubai

రెండేళ్ల క్రితం హర్యానాలో ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత దేశం విడిచి పారిపోయిన భారతీయ గ్యాంగ్‌స్టర్ రావు ఇందర్‌జీత్ యాదవ్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు. ఇందర్‌జీత్‌కు సంబంధించిన పత్రాలను దుబాయ్ అధికారులు కోరారని, అతడిని అతి త్వరలో భారత్‌కు అప్పగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచి డబ్బుల వసూలు, ఆయుధాలతో బెదిరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవ్‌పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు 15కు పైగా కేసులు నమోదు చేశారు (Rao Inderjeet Yadav arrest Dubai).


రావు ఇందర్‌జీత్ యాదవ్.. జెమ్ రికార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మ్యూజిక్ కంపెనీని 2006లో స్థాపించాడు. ఈ కంపెనీ హర్యానా, పంజాబీ, హిందీ భాషలలో ప్రాంతీయ పాటలను నిర్మించి, పంపిణీ చేసే ఒక వీడియో-ఆన్-డిమాండ్ (OTT) ప్లాట్‌ఫామ్‌. యాదవ్ విలాసవంతమైన జీవనశైలిని గడుపుతాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడికి లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు కూడా ఉన్నాయి. అతడి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జరిపిన దాడుల్లో రూ.6 కోట్లకు పైగా నగదు, రూ.17 కోట్లకు పైగా నగలు, రూ.35 కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయి (Dubai arrest Indian criminal).


2024 డిసెంబర్‌లో రోహ్‌తక్‌కు చెందిన ఫైనాన్సర్ మంజీత్ దిఘాల్ హత్య కేసులో యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ హత్య తర్వాత కొద్దికాలానికే యాదవ్ దేశం విడిచి పారిపోయాడు. గత ఏడాది జూలైలో గాయకుడు రాహుల్ ఫజిల్పురియా ఇంటిపై జరిగిన కాల్పుల కేసులో, ఆగస్ట్‌లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో కూడా ఇందర్‌జీత్ పేరు తెర పైకి వచ్చింది. దుబాయ్‌లో ఉంటూ అనుచరుల ద్వారా భారత్‌లో నేరాలు చేస్తున్నాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి (Indian gangster luxury life).


ఇందర్‌జీత్‌కు అంతర్జాతీయ నేర గ్యాంగ్‌లతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా అతడిని దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు తరలించే ప్రక్రియపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కాగా, గతేడాది దుబాయ్‌ నుంచి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇందర్‌జీత్.. తాను గ్యాంగ్‌స్టర్‌ను కానని, ఓ కుట్రలో బాధితుడిని మాత్రమేనని చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..


పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 09 , 2026 | 01:42 PM