విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:45 PM
'విజయ్ ఫర్ పీఎం' నినాదంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీవీకే కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తున్న ఈ నినాదం కారణంగా టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను 2029 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నినాదం కారణంగా టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. టీవీకే కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తున్న 'విజయ్ ఫర్ పీఎం' నినాదంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు (Vijay Prime Minister 2029).
2029 లోక్సభ ఎన్నికల్లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలని తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు కనిపిస్తున్నాయి. టీవీకే కార్యకర్తల్లో ఈ ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ప్రతిపక్ష కూటమి తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉండనున్నారు. దీంతో విజయ్ వర్సెస్ రాహుల్ గాంధీ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై తమిళనాడు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు (TVK Congress rift).
టీవీకే ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ సహా కొన్ని మిత్రపక్షాల మద్దతు కీలకం. ఈ నేపథ్యంలో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావాలన్న టీవీకే కార్యకర్తల ప్రచారం రెండు పార్టీల సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలపై చర్చ జరుగుతున్న సమయంలో తమిళనాడు అసెంబ్లీలో కూడా కీలక మార్పు చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత తారహై కుత్బర్ట్ సీటును టీవీకే సభ్యులకు కేటాయించిన విభాగం నుంచి ప్రతిపక్ష బెంచీల ముందు వరుసకు మార్చారు (Vijay Rahul Gandhi).
ఈ మార్పు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కుత్బర్ట్ మాత్రం ఆ వాదనను ఖండించారు. తనకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొత్త బాధ్యత రావడంతోనే సీటింగ్లో మార్పు జరిగిందని స్పష్టం చేశారు. టీవీకే-కాంగ్రెస్ మధ్య తీవ్రమైన విభేదాలు లేవని కుత్బర్ట్ స్పష్టం చేశారు. విజయ్, రాహుల్ గాంధీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 'విజయ్ ఫర్ పీఎం' అనేది టీవీకే పార్టీ అధికారిక నిర్ణయం కాదని, కార్యకర్తల నుంచి వచ్చిన నినాదమేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి
క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల