Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:43 AM
విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.
- తూటా ఎవరి తుపాకీ నుంచి వచ్చిందో తేలిపోతుంది
- బీజేపీ నాయకులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి
బళ్లారి(బెంగళూరు): బళ్లారి ఎస్పీ సర్కిల్లో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠను ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్రీరాములు(Sri Ramulu) ఆరోపించారు. బళ్లారిలో గూండాలను ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. హవ్వంబావిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద గురువారం రాత్రి జరిగిన తుపాకీ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు మరణించాడని, చాలా మంది గాయపడ్డారని అన్నారు.
యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి మనుషులు కారం పొడి చల్లుతూ కర్రలు, పెట్రోల్ బాంబులతో గాలి జనార్దన్ రెడ్డి ఇంటివద్దకు వచ్చి దాడిచేశారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహన్ని 30 ఏళ్ల క్రితమే ఎస్పీ సర్కిల్లో ప్రతిష్ఠించామని, వాల్మీకి సర్కిల్ అని నామకరణం చేశామన్నారు.

ప్రైవేటు గన్మెన్ కాల్చారు..
రాజశేఖర్ రెడ్డి మరణానికి పోలీసుల చేతిలో ఉండే తుపాకీలు కారణం కాదనీ, ప్రైవేటు గన్మెన్ తుపాకీ నుంచి వచ్చిన తూటాలే కారణమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి ఆరోపించారు. అది ఎవరి తుపాకీనో పోలీసులు నిర్ధారిస్తారని అన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి బళ్లారిలో చేస్తున్న అరాచకాల కారణంగా అధికారులు, ప్రజలు, వ్యాపారులు.. అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మట్కా, గ్యాంబ్లిగ్, పేకాట, గాంజా.. ఇలా అన్నిటినీ ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.
జరిగిన సంఘటనపై ప్రైవేటు కేసులు వేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే భరత్ రెడ్డి తమ ఇంటిపై దాడికి ఉసిగొల్పారని అన్నారు. ఎమ్మెల్యే భరత్ తండ్రి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చిన్నాన్న క్రిమినల్ అలోచన కలిగిన వ్యక్తులని అన్నారు. మునుపటి నుంచి సూర్యనారాయణరెడ్డి క్రిమినల్స్ను పెంచి పోషించాడని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనీల్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News