TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్
ABN , Publish Date - Jan 12 , 2026 | 09:08 PM
విజయ్ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ (Vijay) సీబీఐ (CBI)కి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సీబీఐ ముందు విజయ్ సోమవారం నాడు హాజరయ్యారు. సుమారు ఆరు గంటల సేపు విచారణ సాగింది. పొంగల్ తర్వాత మరోసారి విజయ్ను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.
తొక్కిసలాట ఘటనతో టీవీకేకు సంబంధం లేదని, పరిస్థితి చేయిదాటకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయాయని విచారణలో సీబీఐకి విజయ్ చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకుముందు సీబీఐ ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం ఇచ్చారు.
మళ్లీ పిలుస్తాం..
కాగా, విజయ్ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
టీవీకే ర్యాలీ సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఘటన తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కాగా, చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యంగా వేదిక వద్దకు విజయ్ రావడంతో ఒక్కసారిగా జనం తోసుసుకువచ్చి ఈ దుర్ఘటన జరిగిందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. ఆహారం, నీళ్లు, టాయెలెట్ సౌకర్యాలు కూడా తగినంత లేకపోవడంతో అలిసిపోయిన జనసమూహం అదుపుతప్పిందని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను విజయ్ తోసిపుచ్చారు. దీనిని అధికార డీఎంకే కుట్రగా పేర్కొన్నారు. విజయ్ ఆరోపణలను డీఎంకే ఖండించింది.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్గా రాఘవ్ చద్దా
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి