Germany Visa Free Transit: ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.. భారతీయులకు జర్మనీ శుభవార్త..
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:35 PM
తమ దేశం మీదుగా ప్రయాణించే భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు జర్మనీ తాజాగా పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు జర్మనీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రహిత జర్నీ సదుపాయాన్ని కల్పించినట్టు వెల్లడించింది. భారత్తో కలిసి సోమవారం నాడు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మర్ట్స్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్లో రెండు రోజులు పర్యటించేందుకు నేడు ఉదయం ఆయన వచ్చారు (Germany Visa Free Transit Facility To Indians).
ఏమిటీ వీసా ఫ్రీ ట్రాన్సిట్
జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులు గతంలో ట్రాన్సిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధన నుంచి భారతీయులకు తాజాగా జర్మనీ మినహాయింపు ఇచ్చింది. దీంతో, భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తులు చేసుకోవడం, వీసా కోసం వేచి చూడటం వంటి ఇక్కట్ల నుంచి విముక్తి లభించింది.
భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పించినందుకు జర్మనీ ఛాన్సలర్కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా విద్యా రంగం, నైపుణ్యాలు సంబంధిత అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. భారత్, జర్మనీలు సంయుక్తంగా డ్యుయెల్, జాయింట్ డిగ్రీ కోర్సులను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉన్నత విద్యలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యకు సంబంధించి సమష్టిగా ఓ ప్రణాళిక రూపొందించాలనీ నిర్ణయించారు. భారతదేశ నూతన విద్యావిధానం కింద జర్మనీ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ప్రారంభించాలని కూడా ప్రధాని మోదీ ఆహ్వానించారు.
ఇవీ చదవండి:
ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఓ కీలక అప్డేట్! నేటి నుంచీ..
సామాన్యులకే వందేభారత్ స్లీపర్.. వీఐపీ కోటాకు నో ఛాన్స్!