కొలీజియం స్వతంత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:41 AM
కొలీజియం ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. తనకంటే జూనియర్లకు పదోన్నతి కల్పించారంటూ హిమాచల్ప్రదేశ్కు చెందిన జ్యూడీషియల్ అధికారి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
న్యూఢిల్లీ, జూన్ 23: కొలీజియం ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందకు రాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంగా హిమాచల్ప్రదేశ్కు చెందిన సీనియర్ జ్యూడీషియల్ అధికారి దాఖలు చేసిన పిటిషన్ను ఈ ధర్మాసనం కొట్టేసింది.
కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకుని కొత్త సమస్యలను కొనితెచ్చుకోలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. జడ్జీల ఎంపిక అనేది పూర్తిగా కొలీజియం అంతర్గత సంతృప్తిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. కేవలం సీనియార్టీ ఉన్నంత మాత్రాన హైకోర్టు జడ్జీగా పదోన్నతి పొందే హక్కు ఎవరికీ లభించదని కుండబద్దలు కొట్టింది. కొలీజియం దృష్టిలో అభ్యర్థి యొక్క 'యోగ్యతతోపాటు అర్హత' మాత్రమే అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపిన తర్వాత.. దానిపై న్యాయ పరంగా మళ్లీ చర్చలు లేదా వాదనలు జరపడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పింది. తనకంటే జూనియర్లకు పదోన్నతి కల్పించారంటూ హిమాచల్ప్రదేశ్కు చెందిన అధికారి చేసిన అభ్యర్థనను ఈ సందర్భంగా ధర్మాసనం తోసిపుచ్చింది. కొలీజియం వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం స్పష్టంగా వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీటీవీ ఫుటేజ్ మాయం
పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్
Read Latest National News And Telugu News