చిన్నారుల అదృశ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశాలు!
ABN , Publish Date - May 23 , 2026 | 05:44 PM
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
న్యూ ఢిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ బ్యాక్లాగ్ పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది. ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి, అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ముఠాల నెట్వర్క్ను ఛేదించడానికి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
చిన్నారుల అదృశ్యం కేసుల్లో 'కిడ్నాపింగ్' గానే భావించి దర్యాప్తు చేయండి: సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు!
జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. చిన్నారుల అదృశ్యం కేసులను కేవలం 'మిస్సింగ్' కేసులుగా కాకుండా, అంతర్రాష్ట్ర ముఠాల కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. పోలీసుల వద్ద ఉన్న క్రిమినల్ ట్రాకింగ్ (CCTNS) డేటాబేస్, చైల్డ్ వెల్ఫేర్ అథారిటీల వద్ద ఉన్న 'విశాల్ వాసిల్య' డేటాబేస్ మధ్య సమన్వయం లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఐదు కీలక ఆదేశాలను జారీ చేసింది.

డేటాబేస్ల అనుసంధానం
దేశంలోని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న చిన్నారుల డేటాబేస్లన్నింటినీ అనుసంధానం (Integrate) చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోర్టు ఆదేశించింది. దీనివల్ల పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWCs), జిల్లా బాలల రక్షణ విభాగాలు (DCPUs) చైల్డ్ కేర్ హోమ్ల మధ్య సమాచారం రియల్ టైమ్లో షేర్ అవుతుంది.
'యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్' పునరుద్ధరణ
చాలా జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని అన్ని AHTUలను తగిన అధికారాలు, మౌలిక సదుపాయాలతో 4 వారాల్లోగా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కిడ్నాపింగ్ కిందే కేసు నమోదు
ఏదైనా చైల్డ్ మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే.. అధికారులు ప్రాథమికంగా దానిని కిడ్నాప్ లేదా అపహరణగా భావించి దర్యాప్తు ప్రారంభించాలి. దీనివల్ల ప్రొసీజర్ ఆలస్యం కాకుండా దర్యాప్తులో సీరియస్నెస్ వస్తుందని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఆ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానాలు ఉంటే.. నిబంధనల ప్రకారం 4 నెలలు వేచి చూడకుండా వెంటనే కేసును AHTU విభాగానికి బదిలీ చేయాలని స్పష్టం చేసింది.
24 గంటల్లోగా కుటుంబానికి అప్పగింత
రక్షించిన లేదా రికవరీ చేసిన చిన్నారులను సాధారణంగా 24 గంటల్లోగా వారి కుటుంబాలకు అప్పగించాలి. ఒకవేళ ఆ నిర్దిష్ట చైల్డ్ ట్రాఫికింగ్ లేదా దోపిడీ వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వస్తే తప్ప, మిగిలిన సమయాల్లో తక్షణమే తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి. కుటుంబ సభ్యులపై అనుమానం ఉంటే ఆ బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు చూసుకోవాలి.
గుర్తింపు నిర్ధారణ, పర్యవేక్షణ
రక్షించిన ప్రతి బిడ్డకు ఒకే గుర్తింపు ఉండేలా చూసుకోవడం, భవిష్యత్తులో వారి ఆచూకీని సులభంగా పర్యవేక్షించడం కోసం అవసరమైన అధికారిక రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను (DCPUs) కోర్టు ఆదేశించింది. తద్వారా ఐడెంటిటీ డూప్లికేషన్ను నిరోధించవచ్చని పేర్కొంది.
కేసు నేపథ్యం ఏమిటి?
2011 సెప్టెంబరులో చెన్నైలోని విరుగంబాక్కం పరిధిలో 'కవిత' అనే చిన్నారి అదృశ్యమైంది. స్థానిక పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఈ కేసును 'undetectable' (ఆచూకీ లభించనిది) గా పేర్కొంటూ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. దీనిపై తండ్రి జి. గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను 2025 మార్చిలో మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. చిన్నారి 2011 లో మిస్ అయింది కావున, 2013 లో వచ్చిన హోం శాఖ యాంటీ-ట్రాఫికింగ్ గైడ్లైన్స్ దీనికి వర్తించవని హైకోర్టు పేర్కొంది.
ఈ తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 'చిన్నారి ఆచూకీ లభించనంత కాలం, చైల్డ్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్, యాంటీ-ట్రాఫికింగ్ ప్రొటోకాల్స్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, దేశవ్యాప్తంగా ఉన్న మిస్సింగ్ చిన్నారుల సమస్యపై ఈ సమగ్ర ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు, 2026 కు వాయిదా వేసింది. ఆ సమయంలోగా అన్ని రాష్ట్రాలు, అధికారులు దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
మరణానికి ముందు సెలూన్ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు