రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:38 PM
రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టును శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ: రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court)ను శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది. దీనిపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్జి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది.
ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏజెంట్లు ఇచ్చిన హామీలతో టూరిస్టు, స్టూడెంట్ ఇతర చట్టబద్ధమైన వీసాలతో వీరంతా రష్యా వెళ్లారని, అయితే వారి పాస్పోర్టులు, గుర్తింపు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, వారి కదలికలపై ఆంక్షలు విధించారని, వీరిని ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేలా ఒత్తిడి తెచ్చారని బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వారి ఆచూకీ కోసం దౌత్యపరమైన చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి.
ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధంలో కొందరు గాయపడటం, మరికొందరు నిర్బంధంలో ఉన్నట్టు తమకు తెలిసిందని పిటిషన్లర తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలించి కేంద్రం నుంచి సూచనలు తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం వారంలోగా నోటీసుకు జవాబివ్వాలని ఆదేశించింది. ఈనెలాఖరులో విచారణ చేపడతామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
లెబనాన్పై దాడులు.. పెద్దఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ