పంజాబ్లో హై అలర్ట్.. పేలుడుకు బాధ్యత వహించిన ఖలిస్థానీ గ్రూప్..
ABN , Publish Date - May 06 , 2026 | 11:41 AM
పంజాబ్లో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. జలంధర్ పేలుడు వెనుక తమ హస్తముందని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
పంజాబ్లో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. జలంధర్ పేలుడు వెనుక తమ హస్తముందని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మంగళవారం రాత్రి అమృత్సర్ కంటోన్మెంట్ ప్రాంతం సమీపంలోనూ, జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయం దగ్గర ఈ రెండు పేలుళ్లు జరిగాయి. ఈ రెండు ఘటనలు కొన్ని గంటల వ్యవధిలోనే జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు (Punjab twin blasts).
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బీఎస్ఎఫ్ కార్యాలయం బయట పార్క్ చేసిన ఉన్న ఓ స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే సమీపంలో ఉన్న కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మరో రెండు గంటల వ్యవధిలో అమృత్సర్ కంటోన్మెంట్ ప్రాంతం సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఎవరో పేలుడు పదార్థాలను విసిరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడులు చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది (Jalandhar BSF HQ blast).
జలంధర్లో జరిగిన పేలుడు వెనుక తమ హస్తముందని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది (Khalistani group). ఫిబ్రవరిలో గురుదాస్పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసుల చేతిలో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు వెల్లడించింది. తమ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. అయితే ఈ పేలుళ్ల కారణంగా ఎవరూ చనిపోలేదని పంజాబ్ పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా