మహారాష్ట్ర కల్తీ మద్యం ఘటన.. 24కు చేరిన మృతులు..
ABN , Publish Date - May 31 , 2026 | 09:30 PM
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్, మే 31 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన 21 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధికారుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీవండీ కేంద్రంగా నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్వర్క్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
దాడుల్లో మొత్తం 4,480 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ, నిల్వ కేంద్రాలను గుర్తించి తనిఖీలు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో స్థానికంగా కల్తీ మద్యం మాఫియా కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించడంలో, వారిపై తక్షణ చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమైనట్లు తేలింది. ఈ కారణంగానే సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నకిలీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను కూడా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితుల బంధువులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. కల్తీ మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ
సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News