Share News

బ్రిక్స్‌ కూటమి మాత్రమే కాదు.. పరిష్కారాల వ్యవస్థ: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:13 PM

బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ కూటమి చివరి రోజు ఆయన మాట్లాడారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బ్రిక్స్‌ కూటమి మాత్రమే కాదు.. పరిష్కారాల వ్యవస్థ: ప్రధాని మోదీ

ఢిల్లి: బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఢిల్లీలో ఆదివారం బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ఆయన మాట్లాడారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి దార్శనికత, భవిష్యత్ సహకారానికి ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను నిర్ణీత కాలపరిమితిలో కార్యాచరణగా మార్చుతామని అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాలు పత్రాలకు మాత్రమే పరిమితం కావన్నారు. వాస్తవ జీవితంలో ప్రభావం చూపేలా పనిచేస్తామని మోదీ హామీ ఇచ్చారు.


ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ

మరోవైపు బ్రిక్స్ దేశాల అధినేతలతో మోదీ వరుసగా భేటీ అవుతూ బిజీగా గడపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పరస్పర సహకారం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. కజకస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమ్రాట్ తొకయెవ్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్, సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా, నైజీరియా ఉపాధ్యక్షుడు ఖాసిం షెట్టిమాతో మోదీ భేటీ కానున్నారు. కాగా.. ద్వైపాక్షిక చర్చలన్నీ భారత మండపంలో జరగనున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

Updated Date - Sep 13 , 2026 | 03:18 PM