తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేడా ముందస్తు బెయిలు పిటిషన్
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:00 PM
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్య రిణికి భూయాన్ శర్మ తనపై చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా తెలంగాణ హైకోర్టును బుధవారంనాడు ఆశ్రయించారు. ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ వేశారు.
హెదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్య రిణికి భూయాన్ శర్మ తనపై చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా (Pawan Khera) తెలంగాణ హైకోర్టును బుధవారంనాడు ఆశ్రయించారు. ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ వేశారు. అస్సాంలోని కోర్టులను ఆశ్రయించేందుకు వీలుగా ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ కోరారు. గురువారంనాడు ఈ పిటిషన్పై జస్టిస్ కె సుజన విచారణ జరిపే అవకాశం ఉంది.
రిణికి భూయాన్కు మూడు దేశాల పాస్పోర్టులు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్లో హిమంత బిశ్వ శర్మ వెల్లడించకుండా దాచిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలను రిణికి భూయాన్ ఖండించారు. ఆయనపై పోలీసు కేసు పెట్టారు. దీంతో అస్సాం పోలీసు బృందం పవన్ ఖేడాను ప్రశ్నించేందుకు మంగళవారంనాడు ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే ఆ సమయంలో పవన్ ఖేడా అక్కడ లేరు.
వివాదం ఇలా...
అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ పవన్ ఖేడా చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. యూఏఈ, ఆండిగ్వా బార్బుడా, ఈజిప్ట్ నుంచి హిమంత బిశ్వ శర్మ భార్య పేరుతో మూడు పాస్పోర్టులు ఉన్నాయని పవన్ ఖేడా ఆరోపించారు. జీవితమంతా ముస్లింలపై విద్వేషంతోనే హిమంత గడిపారని, కానీ ఆయన భార్య రెండు ముస్లిం దేశాల నుంచి పాస్పోర్టులు కలిగి ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దేశం నుంచి పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను హిమంత బిశ్వ శర్మ ఖండించారు. పవన్ ఖేడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, సత్యం బయటపడి ఆయన తప్పుడు ప్రచారానికి ప్రచారానికి తెరపడుతుందని, ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చని అన్నారు. రిణికి భూయాన్ సైతం భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, తనకు మూడు పాస్పోర్టులు ఉండటం అబద్ధమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్టాలిన్కు అధికారం ఉంటే.. నా సభ జరిగేది కాదు
ఖరీఫ్ సీజన్లో న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,534 కోట్లు.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం