Share News

అలా ఉండుంటే.. పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో విలీనం కోరుకునేవారు: ఒమర్ అబ్దుల్లా

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:22 PM

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు.

అలా ఉండుంటే.. పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో విలీనం కోరుకునేవారు: ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను 2019లో రద్దు చేయకపోయి ఉంటే.. ఇప్పుడు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని ఆయన అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు (Omar Abdullah PoK).


పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజలపై జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆక్రమణదారులను ఎదుర్కొన్న కశ్మీరీ ప్రజలను ఒమర్ అబ్దుల్లా గుర్తుచేసుకున్నారు. తన తాత, జమ్మూకశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా నేతృత్వంలోని కశ్మీరీలు ఆక్రమణదారులను ఎదుర్కొన్నారని చెప్పారు (J&K statehood Article 370).


భారత సైన్యం కశ్మీర్‌కు చేరుకోవడానికి ముందే స్థానిక ప్రజలు తమ ప్రాంతాన్ని రక్షించేందుకు పోరాడారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 2019లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను రద్దు చేయకపోయి ఉంటే.. ఈ రోజు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు సంబంధించిన స్థానాలను ఖాళీగా ఉంచామని, ఏదో ఒక రోజు అవి భర్తీ అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు (Omar Abdullah PoK statement).


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఇతర రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను జమ్మూకశ్మీర్ బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ తప్పుపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన్ని రాజకీయ వ్యాఖ్యలకు ఉపయోగించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..


అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 15 , 2026 | 04:22 PM