ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన 8 మంది.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:19 AM
ముంబైలో ప్రమాదవశాత్తూ గుంతలో పడి 8 మంది యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
ముంబై: ఓ భవనంలో ప్రమాదం జరిగి 8 మంది గాయపడిన ఘటన పశ్చిమ భాండూప్లోని మెట్రో మాల్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ గోతిలో పడడంతో బాధితులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఏప్రిల్ 23న రాత్రి జనతా మార్కెట్ సమీపంలోని మాతోశ్రీ హాల్లో ఓ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి వచ్చిన కొంతమంది యువకులు రాత్రి 11:30 గంటల సమయంలో మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ(SRA)కి చెందిన స్థలం వద్దకు వెళ్లారు. నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించారు. ప్రమాదవశాత్తూ అక్కడున్న గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల సమాచారంతో ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వారిని బయటకు తీసి తమ భుజాలపై ఎత్తుకుని మరీ అంబులెన్స్ల వద్దకు చేర్చారు. అనంతరం సమీప ఆస్పత్రులకు తరలించారు. బాధితులను అనికేత్ కదమ్ (26), శ్రేయస్ సర్వే (25), జైదీప్ షా (21), సంకేత్ జువత్కర్ (25), ఆదిత్య అహెర్ (26), అనికేత్ మహేష్ పాటిల్ (20), అంకిత్ కుమార్ రోహిత్ (19), భల్చంద్ర ఫల్లే (25)గా గుర్తించారు. వీరిలో భల్చంద్ర ఫల్లే పరిస్థితి విషమంగా ఉంది. అయితే, అసలు వీరు ఆ భవనంలోకి ఎందుకు వెళ్లారనే విషయం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ హత్యాచారం కేసులో నిందితుడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..
సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది