మహరాజా ఎక్స్ప్రెస్పై కుట్ర.. భగ్నం చేసిన లోకో పైలట్
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:50 PM
అత్యంత విలాసవంతమైన మహరాజా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను ఉంచారు. లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో అత్యంత విలాసవంతమైన పర్యాటక రైళ్లలో ఒకటైన మహారాజా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలును ప్రమాదానికి గురిచేయడానికి జరిగిన ఒక పెద్ద కుట్రను లోకో పైలట్ అప్రమత్తమై భగ్నం చేశారు. ఈ రైలు వందలాది మంది విదేశీ పర్యాటకులతో జైపూర్ నుంచి సవాయ్ మాధోపూర్ వెళ్తోంది. మంగళవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో శివదాస్పురా ప్రాంతంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రి సమీపంలో రైల్వే ట్రాక్పై ఇనుప రాడ్లు ఉంచడాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన అతను, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు.
అనంతరం రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైలును పట్టాలు తప్పించాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో ఇనుప రాడ్లను ట్రాక్ పై ఉంచారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఐదు అడుగుల పొడవున్న ఆరు ఇనుప రాడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్పై ఉంచారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో రైలు సుమారు 35 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహాయంతో ట్రాక్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రాక్ సురక్షితమని ప్రకటించిన తర్వాత, రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్ పెట్రోలింగ్ , భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబర్లో రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఆరావళి ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించడానికి ట్రాక్ పై పెద్ద స్తంభాన్ని ఉంచారు. అంతకుముందు అజ్మీర్లో కూడా రైళ్లను పట్టాలు తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇటీవల ఉదయ్పూర్, అల్వార్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. అల్వార్ జిల్లాలో ఇంటర్సిటీ ఖజురహో ఎక్స్ప్రెస్పై దాడి జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఉద్ధవ్కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్ఎస్
తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్