జమ్మూ-కశ్మీర్లో లష్కర్ కమాండర్ యాసిర్ హతం
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:39 PM
జమ్మూ కశ్మీర్లోని బద్గాం జిల్లా యూస్మార్గ్ పర్వత ప్రాంతంలో లష్కరే తొయిబాకు చెందిన పాకిస్థానీ కమాండర్ 'యాసిర్' హతమయ్యాడు. ఆర్మీకి చెందిన 53 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఫోర్సెస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 5: జమ్మూ కశ్మీర్లోని బద్గాం జిల్లా యూస్మార్గ్ పర్వత ప్రాంతంలో ఇవాళ లష్కరే తొయిబా (LeT)కు చెందిన పాకిస్థానీ కమాండర్ 'యాసిర్' హతమయ్యాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఆర్మీకి చెందిన 53 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఫోర్సెస్ సంయుక్తంగా చేపట్టిన నిఘా ఆధారిత తనిఖీల్లో భాగంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో యాసిర్ ప్రాణాలు కోల్పోయాడు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. యాసిర్ గతంలో లష్కరే తొయిబాకు చెందిన కీలక ఉగ్రవాది 'సులైమాన్ మూసా' గ్రూప్లో సభ్యుడిగా ఉండేవాడు. అయితే ఏడాది క్రితం ఆ గ్రూప్ నుంచి విడిపోయిన ఇతను, యూస్మార్గ్ ఎత్తైన పర్వత ప్రాంతాలలో రహస్యంగా ఉంటూ ప్రత్యేకంగా తన నెట్వర్క్ను నడుపుతున్నాడు. గత కొంతకాలంగా ఇతని కదలికలపై నిఘా ఉంచిన భద్రతా దళాలు, ఈ (శనివారం) ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టాయి.
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన వివిధ తీవ్రవాద ఘటనలు, ప్లానింగ్లలో యాసిర్కు ఏమైనా ప్రమేయం ఉందా, అతనికి సహకరించిన ఇతర ఉగ్రవాదుల నెట్వర్క్ ఏంటి అనే అంశాలపై భద్రతా సంస్థలు విచారణ వేగవంతం చేశాయి.
సులైమాన్ మూసా నేపథ్యం
యాసిర్ గతంలో పనిచేసిన సులైమాన్ మూసా (హాషిమ్ మూసా) 2025లో పహల్గామ్లో జరిగిన దారుణ తీవ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి. ఆ దాడి జరిగిన కొద్ది నెలలకే శ్రీనగర్లోని దాచీగామ్ అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో సులైమాన్ మూసా హతమయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్క్రీన్ టైమ్ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..
ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్
For More National News And Telugu News