Share News

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:17 PM

కొత్తగా విస్తరించిన కర్ణాటక కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేయగా, మరికొందరు అదే దారిలో ఉన్నారు.

కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి.. మొదలైన రాజీనామాల పర్వం
Karnataka Cabinet Rejig Triggers Congress Revolt; MLA Yashwantraya Patil Resigns

బెంగళూరు, ఆగస్టు 3:కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కొందరిలో విపరీతమైన ఆనందోత్సాహానికి, మరికొందరిలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఏకంగా 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో ఒకవైపు పండుగ వాతావరణం సంతరించుకోగా, మరోవైపు తీవ్ర అసమ్మతి, ధర్నాలు, ఆందోళనలకు దారితీసింది.


కాంగ్రెస్‌లో వెల్లువెత్తిన నిరసనలు – ఎమ్మెల్యేల రాజీనామాలు

కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'పార్టీ నాయకత్వం నన్ను తీవ్రంగా గాయపరిచింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని ఆయన పేర్కొన్నారు.

అలాగే బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మైసూర్ నాయకుడు తన్వీర్ సేట్‌కు మంత్రివర్గంలో చోటు నిరాకరించడంతో, ఆయన మద్దతుదారుడొకరు మైసూరులో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించగా, తన్వీర్ సేట్ నేరుగా వెళ్లి పరామర్శించారు.

రహదారుల దిగ్బంధం: ధార్వాడ్‌లో ప్రసాద్ అబ్బయ్య మద్దతుదారులు రహదారిపై టైర్లు కాల్చి, ప్రభుత్వ బస్సుపై రాళ్ళు రువ్వి ఆందోళన చేపట్టారు.

అసమ్మతి నేతల రహస్య భేటీ: హెచ్‌కే పాటిల్, దినేష్ గుండూరావుతో సహా పదవులు దక్కని సీనియర్ నాయకులు బెంగళూరులోని పీ.వీ. జయచంద్ర నివాసంలో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు.

మంత్రి మునియప్ప అసంతృప్తి: మరోవైపు సీనియర్ నేత, కేబినెట్ మంత్రి కె.హెచ్. మునియప్ప కూడా తన శాఖ కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, శాఖను మార్చాలని కోరుతున్నట్లు సమాచారం.

ఆఖరి నిమిషంలో జాబితాలో మార్పులు:

ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు కేబినెట్ జాబితాలో నాటకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన ముసాయిదా నుంచి మంకాల్ వైద్య, గాయత్రి చంద్రశేఖర్‌లను తొలగించి, ఆఖరి నిమిషంలో సీనియర్ నేత ఎస్.ఎస్. మల్లికార్జున్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించారు.

బీజేపీ తీవ్ర విమర్శలు:

కర్ణాటక కాంగ్రెస్ విస్తరణపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చెబుతున్న సామాజిక న్యాయం, మహిళా సాధికారత మాటలకే పరిమితమని ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో ఏకైక మహిళకే చోటు ఇవ్వడం, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బి. నాగేంద్ర, జమీర్ అహ్మద్ ఖాన్‌లను తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవడం కాంగ్రెస్ డొల్లతనాన్ని బయటపెడుతోందని ఆరోపించారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 06:31 PM