'మిస్టర్ మునీర్, యు ఆర్ ఫైర్డ్'.. ఇరాన్ జర్నలిస్ట్ తీవ్ర విమర్శలు!
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:11 PM
బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరాన్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ బసిమ్ లాలే పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ, సెప్టెంబర్ 14: ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సదస్సు వేదికగా ఇరాన్కు చెందిన ప్రముఖ విలేఖరి బసిమ్ లాలే (Basim Laleh) పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు (ఫీల్డ్ మార్షల్) ఆసిమ్ మునీర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మిస్టర్ మునీర్, యు ఆర్ ఫైర్డ్' అంటూ వార్తా సంస్థ 'ANI'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని, ముఖ్యంగా వ్యూహాత్మక 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని లాలే విమర్శించారు. ఆర్థిక సంక్షోభాలు, నిరంతర రుణాల కోసం విదేశాలపై ఆధారపడే స్థితి పాకిస్థాన్ దౌత్య పరిధిని దెబ్బతీసిందని, ఆ స్థానంలో భారత్ శక్తివంతమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
భారత్ - ఇరాన్ - యూఏఈ కొత్త భాగస్వామ్యం
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ - యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీని ఉటంకిస్తూ.. పశ్చిమాసియాలో భారత్ పాత్ర మరింత వేగంగా విస్తరిస్తోందని లాలే వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానం వల్ల రాబోయే రెండు నెలల్లోనే పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు తొలగిపోయి శాంతి నెలకొనే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ ఉగ్రవాద ఆరోపణలు, ఆర్థిక అస్థిరతలతో పాకిస్థాన్ మూలపడగా, భారత్ తన ఆర్థిక బలం, వాణిజ్య బంధాలు, విశ్వసనీయమైన దౌత్యంతో గ్లోబల్ సౌత్, ఇంకా పశ్చిమాసియా దేశాలను ఒకే తాటిపైకి తెచ్చే ప్రధాన శక్తిగా మారిందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు..
రేసింగ్ ట్రాక్పై విజయ్–అజిత్ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?
Read Latest National News And Telugu News