శుభాన్షు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:37 PM
సైనికులకు ఇచ్చే శౌర్య పురస్కారం అశోక చక్రను గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అందుకున్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన తీసుకున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 26: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడుగుపెట్టిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో కెప్టెన్ శుభాన్షు శుక్లాకు ఆమె ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు యాక్సియమ్-4 మిషన్ చేపట్టిన సమయంలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అసాధారణ ధైర్యంతో పాటు ఆయన సంకల్పానికి గౌరవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
2025 జూన్లో 'యాక్సియమ్-4' మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు. ఖగోళంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం, మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే అంశాలపై ఆయన వీడియో చిత్రీకరించారు. అలాగే అంతరిక్షంలో మానవ వ్యోమగాముల పరిస్థితిపై సైతం ఆయన అధ్యయనం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణతంత్ర దినోత్సవం.. ఆ షాపులు బంద్..
2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
For More AP News And Telugu News