దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:20 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.
వావ్ థరాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. భారత్ సమర్ధవంతంగా అమలు చేస్తున్న విదేశాంగ విధానం, ప్రజల ఐక్యతే ఇందుకు కారణమని అన్నారు. ప్రధానమంత్రి గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు అసర్వా-అసర్వా-ఖేద్బ్రహ్మ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతీయ సంఘీభావం అవసరమైన ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ నేతలు భయాలు, వదంతులు వ్యాప్తి చేయడంలో బిజీగా ఉన్నారని తప్పుపట్టారు. చిక్కులు మరింత పెరుగుతాయని కాంగ్రెస్ ఎదురుతెన్నులు చూస్తోందని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం పరిస్థితిని వాడుకునేందుకు రాజకీయ రాబందులా ఎదురు చూస్తోందని విమర్శించారు.
సోలార్ విద్యుత్ రంగంలో గుజరాత్ ముందంజలో ఉంటూ వెలుగులు విరజిమ్ముతోందని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో దేశంలోనే గుజరాత్ ముందుందని అన్నారు. 2010లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్టీ టెక్నాలజీ ప్రాజెక్టు అయిన సోలార్ పార్క్ను ఏర్పాటుకు చొరవ తీసుకున్నానని, అది ఈ ప్రాంతంలో సోలార్ ఎనర్జీ మూవ్మెంట్కు ఎంతో దోహదపడిందని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
యూసీసీ అమలు, లవ్ జిహాద్కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్