ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:22 PM
పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని, న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
జ్యుడిషియల్ అధికారులను కోర్టు నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ దాఖలైన తాజా పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజేఐ మండిపడ్డారు. 'న్యాయాధికారులను ప్రశ్నించే సాహసం చేయవద్దు. ఇంతకంటే వాళ్ల నుంచి ఎలాంటి త్యాగాలు మీరు కోరుకుంటున్నారు? తొలిగించిన ఓటర్లకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు న్యాయాధికారులు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారిని అనుమానించే చర్యలను సహించేది లేదు' అని అన్నారు.
ఓటర్ల జాబితా నుంచి తమను తొలగించారంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్న న్యాయాధికారులకు తగిన లాజిస్టిక్ సపోర్ట్ అందించాలని ఎన్నికల కమిషన్, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఓటర్లను భారీగా తొలగిస్తున్నారనే ఆరోపణలపై బెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య జరుగుతున్న పోరును చూస్తే ఇరువర్గాల మధ్య విశ్వాస లోటు ఉందనిపిస్తోందని కూడా కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొంది. జ్యుడిషియల్ అధికారులు నిరాకరించిన ఓటర్లు ఈ ట్రిబ్యునల్స్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. ట్రిబ్యునల్స్కు సేవలందించేందుకు అంగీకరించిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులకు గౌరవ వేతనాన్ని నిర్ణయించాలని కోల్కతా హెకోర్టు చీఫ్ జస్టిస్ను సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల కమిషన్తో సంప్రదించి గౌరవ వేతానాన్ని నిర్ధారించాలని, ఈసీ దానిని చెల్లిస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
అర్హులైన ఏ ఒక్క ఓటరునూ తొలగించం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం