ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:00 PM
ఇరాన్ యుద్ధం భారత్లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ యుద్ధం భారత్లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో చర్చలు జరిపారు. ఎల్పీజీ ఉత్పత్తులు, సరఫరాపై సమీక్ష జరిపారు. ఇరాన్ యుద్ధం సామాన్యులపై ప్రభావం చూపకూడదని ప్రధాని మోదీ మంత్రులకు తెలిపారు.
అలాగే యుద్ధంతో ఉత్పన్నమయ్యే అంతరాయాల గురించి చర్చించారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు పరిశ్రమల నుంచి గ్యాస్ను మళ్లించడం ద్వారా ప్రజలకు గ్యాస్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత బుకింగ్లు జరిగేవి, ఇప్పుడు25 రోజులకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలానే ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత కలగకుండా కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్(ESMA) ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించే ఉద్దేశంతో పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు రెండున్నర లేదా మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరిగేది, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి. అన్ని శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
గుడ్ న్యూస్.. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు..
కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రభుత్వ నిర్ణయాలు ఇవీ