‘అతిథి దేవో భవ’.. బ్రిక్స్ అతిథులకు రాజసం ఉట్టిపడేలా భారతీయ ఆతిథ్యం
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:06 PM
బ్రిక్స్ అతిథుల కోసం జైపూర్కు చెందిన అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక వెండి టేబుల్వేర్, కట్లరీని సిద్ధం చేసింది. భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వీటిని ప్రత్యేక డిజైన్లతో రూపొందించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా హాజరవుతున్న అతిథుల కోసం జైపూర్కు చెందిన ప్రముఖ సంస్థ అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక వెండి టేబుల్వేర్, కట్లరీని రూపొందించింది. ప్రాచీన భారతదేశంలో రాజులు, మహారాజుల విందుల్లో ఉపయోగించిన పాత్రలను గుర్తుచేసేలా రాజసం ఉట్టిపడే సంప్రదాయ డిజైన్లతో వీటిని తయారు చేశారు.

భారతీయ, చైనీస్, రష్యన్ తదితర దేశాల వంటకాలను వడ్డించేందుకు అనువుగా దాదాపు 50 నుంచి 60 రకాల గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు, మూతలతో కూడిన కంటైనర్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రను ఎంతో నైపుణ్యంతో రూపొందించి, అందమైన కళాకృతులతో అలంకరించారు. ప్రతి వస్తువుకు మెరుగైన మెరుపు, నాణ్యత వచ్చేలా 10 దశల్లో కోటింగ్, ఫినిషింగ్ ప్రక్రియను నిర్వహించారు. భారతదేశానికి వచ్చే విశిష్ట అతిథులను దైవ సమానులుగా భావించే ‘అతిథి దేవో భవ’ సంప్రదాయాన్ని ఈ ప్రత్యేక వెండి పాత్రలు ప్రపంచ దేశాల నేతలకు చాటిచెబుతున్నాయి. భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వీటిని ప్రత్యేక డిజైన్లతో తయారు చేశారు.

అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో అరుణ్ పబువాల్ మాట్లాడుతూ.. ప్రముఖుల కార్యక్రమాలకు తమ టేబుల్వేర్ను అందించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2023లో జరిగిన జీ20 సదస్సుతో పాటు పలు వీఐపీ కార్యక్రమాలు, దేశానికి వచ్చిన అధ్యక్షుల పర్యటనల్లోనూ తమ ఉత్పత్తులను ఉపయోగించినట్లు తెలిపారు. తమ కట్లరీలో ఆధునిక, సంప్రదాయ డిజైన్లు ఉన్నాయని చెప్పారు.
కంపెనీ ఎండీ అంతర పబువాల్ మాట్లాడుతూ.. ఉత్పత్తుల నాణ్యతే తమ ప్రధాన ప్రత్యేకత అని తెలిపారు. పాత్రల తయారీలో నాణ్యత విషయంలో రాజీ పడబోమని చెప్పారు. పూత, డిజైన్, ఫినిషింగ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ఉత్పత్తుల తయారీ నుంచి డిస్పాచ్ వరకు మొత్తం 10 దశల్లో ఫినిషింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు.
Also Read:
మోదీతో ఫొటో కోసం ప్రతినిధుల సందడి.. పుతిన్, పెజెష్కియన్ ఏం చేశారంటే..
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ పదవికి రాజీనామా