Share News

మోదీతో ఫొటో కోసం ప్రతినిధుల సందడి.. పుతిన్, పెజెష్కియన్ ఏం చేశారంటే..

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:50 PM

భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటో దిగేందుకు పలువురు ప్రతినిధులు ఆయన చుట్టూ చేరారు.

మోదీతో ఫొటో కోసం ప్రతినిధుల సందడి.. పుతిన్, పెజెష్కియన్ ఏం చేశారంటే..
BRICS 2026 viral video

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటో దిగేందుకు పలువురు ప్రతినిధులు ఆయన చుట్టూ చేరారు. అదే సమయంలో అక్కడ ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ వారికి చోటిచ్చేందుకు పక్కకు తప్పుకున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (BRICS 2026 viral video).


న్యూఢిల్లీలో శుక్రవారం బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఈ ఘటన జరిగింది. కార్యక్రమం సందర్భంగా మోదీ వద్దకు వచ్చిన కొందరు ప్రతినిధులు ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు. ఓ ప్రతినిధి 'మీతో ఒక ఫొటో దిగొచ్చా' అని అడగ్గా.. మోదీ వెంటనే అంగీకరించారు. దీంతో మరికొందరు ప్రతినిధులు కూడా ఆయన చుట్టూ చేరారు. అందరూ కెమెరాకు పోజిచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కూడా ఉన్నారు (Narendra Modi Photo).


ప్రతినిధులు మోదీ చుట్టూ చేరుతుండటంతో వారికి అవకాశం కల్పిస్తూ పుతిన్, మసూద్ పెజెష్కియన్ పక్కకు వెళ్లారు (Modi viral video). ఫొటోకు పోజిస్తున్న సమయంలో మోదీ చేసిన సరదా వ్యాఖ్య అక్కడ నవ్వులు పూయించింది. మహిళా ప్రతినిధులను ఉద్దేశించి 'యూ ఆర్ లక్కీ, సో మెనీ లేడీస్' అని మోదీ అన్నారు. దీనికి వారు కూడా వెంటనే స్పందిస్తూ 'వుయ్ ఆర్ ఆల్ సో లక్కీ' అన్నారు. దీంతో మోదీతో పాటు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఫొటో సెషన్ ముగిసిన తర్వాత మోదీ వారికి ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..


భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.

Updated Date - Sep 12 , 2026 | 12:50 PM