దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:04 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (West Bengal Assembly Elections) తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banjerjee) తనకు గట్టి పట్టున్న భవానీపూర్ (Bhavanipur) నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను మంగళవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించారు.
టీఎంసీ ప్రకటించిన అభ్యర్థులలో 50 మంది మహిళలు, 95 మంది ఎస్సీ/ఎస్టీలు ఉన్నారు. భాగస్వామ్య పక్షాలకు 3 సీట్లను టీఎంసీ కేటాయించింది. కలింపాంగ్, డార్జిలింగ్, కుర్సెయాంగ్ నియోజకవర్గాల నుంచి వీరు పోటీ చేస్తారు. కాగా, 33 మంది మంత్రులకు టీఎంసీ మళ్లీ టిక్కెట్లు ఇచ్చింది. నలుగురు సిట్టింగ్ మంత్రులు రాయ్ చౌదురి, తాజ్ముల్ హుస్సేన్, జ్యోత్స్న మండి, మనోజ్ తివారీకి ఈసారి టిక్కెట్లు దక్కలేదు. బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29న పోలింగ్ జరగనుంది. మే 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెలువడతాయి.
భవానీపూర్ నుంచి మమత-సువేందు పోటీ
భవానీపూర్ నుంచి మమతాబెనర్జీ మళ్లీ పోటీలోకి దిగుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఇదే నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా విపక్ష నేత సువేందు అధికారిని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో భవానీపూర్ నుంచి మమత-సువేందు మధ్య పోటీ నెలకొంది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కూడా సువేందు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీని ఆయన ఓడించారు. ఈ సారి నందిగ్రామ్ నుంచి పబిత్ర కర్ను టీఎంసీ బరిలోకి దింపింది.
ఇవి కూడా చదవండి..
కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్
మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం