ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన అన్నా హజారే
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:16 PM
బీజేపీ నేత, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, జులై 26: సమస్యలు ఏవైనా సరే హింస ద్వారా కాకుండా శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాలపై, విద్యార్థుల నిరసనలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాలకు, నాయకుల మొదటి ధ్యేయం కావాలని ఆయన అన్నారు.
ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే రెండగులు ముందుకు వేసినా తప్పులేదని అన్నా హజారే పేర్కొన్నారు. మన నిర్ణయాలు ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండటమే ముఖ్యమని ఆయన తెలిపారు. మంత్రుల రాజీనామాలు లేదా ఇతర డిమాండ్లను శాంతియుత మార్గాల్లోనే సాధించుకోవాలని సూచించారు. 'నేను నా జీవితంలో 22 సార్లు నిరాహార దీక్షలు చేశాను. ఎప్పుడూ కూడా హింసను ఆశ్రయించలేదు. అహింసాయుత మార్గంలో నేను పోరాడటం వల్లే సుమారు 10 చట్టాలు రావడం జరిగింది' అని ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హింస ఏ రూపంలో ఉన్నా, ఎవరు చేసినా అది ఎప్పటికీ సరైనది కాదని ఆయన హితవు పలికారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక డిమాండ్లను అంగీకరించడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే ఆందోళనల పేరుతో హింసకు తావివ్వకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతటి పరిస్థితులు ఎదురైనా హింసను మాత్రం ఆశ్రయించవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి అన్నా హజారే సూచించారు.
ఇవి కూడా చదవండి:
విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక