రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్ట్ షాక్.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశం
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:54 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ బెంచ్ ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం(Dual Citizenship) కలిగి ఉన్నారని పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది న్యాయస్థానం.
రాహుల్ గాంధీ భారత్తో పాటు బ్రిటీష్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని ఆరోపిస్తూ.. కర్ణాటకకు చెందిన ఎస్.విఘ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై లోతైన విచారణ అవసరమని పేర్కొంటూ రాయ్బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు తీర్పునిస్తూ.. ఈ వ్యవహారంపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణ చేపట్టాలని లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా.. రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ బెంచ్ గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ