ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:34 AM
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ పలు వాహనాలు ఢీకొని 11 మంది సజీవ దహనమయ్యారు.
మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ పలు వాహనాలు ఢీకొని 11 మంది సజీవ దహనమయ్యారు. నిన్న రాత్రి 08:30 గంటల ప్రాంతంలో డ్రామాండ్గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు మరో ట్రక్కు సహా రెండు కార్లపైకి దూసుకెళ్లింది. రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి.
ఈ ప్రమాదంలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు మీర్జాపూర్ ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన ఒక ట్రక్కుకు బిహార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండగా.. మరొక దానికి మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కార్లలో ఒకటి సోన్భద్ర జిల్లాకు చెందగా.. మరొకటి మీర్జాపూర్ జిల్లాకు చెందినదిగా ఎస్పీ పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది సజీవ దహనం కావడం విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు.. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు..
బస్సులు ఏర్పాటు చేయండి.. ఈసీకి టీవీకే అధినేత విజయ్ అత్యవసర లేఖ