Share News

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:41 PM

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ ప్రాంతంలో 2013లో జరిగిన జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడికి సంబంధించి 10 మందిని నేరస్థులుగా NIA కోర్టు నిర్ధారించింది. ఈ దాడిలో 29 మంది మరణించడమే కాకుండా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు
Jhiram Valley Maoist Attack: 10 Convicted In 2013 Bastar Case

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 5: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై జరిగిన ఘోర మావోయిస్టు దాడి కేసులో జగదల్‌పూర్ ప్రత్యేక ఎన్ఐఏ (NIA) కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ ఈ తీర్పును వెల్లడించగా, దోషులకు విధించే శిక్షల వివరాలను (Quantum of Sentence) సెప్టెంబర్ 16న ప్రకటించనున్నారు.


ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే దారుణమైన దాడి

మే 25, 2013న బస్తర్ జిల్లా దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరమ్ లోయ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘాతుకం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'పరివర్తన్ ర్యాలీ' ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడిలో నాటి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, అసెంబ్లీ మాజీ ప్రతిపక్ష నేత మహేంద్రకర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ వంటి అగ్రనేతలతో పాటు పలువురు భద్రతా సిబ్బంది, పౌరులు అమరులయ్యారు. ఈ ఘటనతో అప్పట్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా దెబ్బతింది.


ఎన్‌ఐఏ విచారణ – సుదీర్ఘ న్యాయపోరాటం

ప్రారంభంలో బస్తర్ పోలీసులు ఈ కేసును నమోదు చేసినప్పటికీ, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఎన్ఐఏ 2014 సెప్టెంబర్‌లో జగదల్‌పూర్ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసి, ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించింది. కేసు సమగ్ర విచారణకు రెండు జుడీషియల్ కమిషన్లు కూడా ఏర్పాటయ్యాయి.

నాయకుల మధ్య రాజకీయ యుద్ధం

ఈ తీర్పుపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్‌ఐఏ అనేక వాస్తవాలను తప్పుదోవ పట్టించిందని, రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా విచారణ జరపకుండా అడ్డుకుందని మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆరోపించారు. నాటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకు సరైన భద్రత కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.

ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఈ సున్నితమైన అంశంపై కేవలం రాజకీయం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన తిప్పికొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్క్రీన్ టైమ్‌ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 05:35 PM