భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి వీక్లీ ఎక్స్ప్రెస్
ABN , Publish Date - May 23 , 2026 | 01:10 PM
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి–తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తిరుపతి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా చర్లపల్లి–తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు ప్రస్తుతం ఉన్న మార్గాలకు భిన్నంగా నల్గొండ–కడప రూట్లో ప్రయాణించనుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి తిరుపతి చేరుకోవడం మరింత సులభం కానుంది.
ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి తిరుపతికి పద్మావతి ఎక్స్ప్రెస్ వరంగల్–విజయవాడ మార్గంలో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్–గుత్తి మార్గంలో సేవలు అందిస్తున్నాయి. అలాగే నారాయణాద్రి ఎక్స్ప్రెస్, వందేభారత్ రైళ్లు నల్లగొండ–గుంటూరు రూట్లో నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలు మరో ప్రత్యామ్నాయ మార్గంలో అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన 07002/07031 చర్లపల్లి–తిరుపతి సర్వీసును ఇకపై 17443/17444 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా కొనసాగించనున్నారు. ట్రైన్ నంబర్ 17443 తిరుపతి నుంచి ప్రతి గురువారం సాయంత్రం 4:30 గంటలకు బయల్దేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8:25 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తొలి సర్వీస్ ఈ నెల 28న ప్రారంభం కానుంది.
అదే విధంగా ట్రైన్ నంబర్ 17444 చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా శనివారం ఉదయం 7:30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఈ సర్వీస్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.
Also Read:
మంగళసూత్రంలో ముత్యాలు, పగడాలు ఎందుకు తప్పనిసరిగా ఉంటాయో తెలుసా?
వేసవిలో గుడ్లు తినడం మంచిదేనా?
For More Latest News