చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు రెండుసార్లు గుండెపోటు!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:44 PM
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యం, చైనా భవిష్యత్ నాయకత్వంపై సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ రెండు లేదా మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 4: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యం, చైనా భవిష్యత్ నాయకత్వంపై సరికొత్త చర్చ మొదలైంది. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సాంగే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జిన్పింగ్ రెండు లేదా మూడుసార్లు గుండెపోటుకు (Heart Attacks) గురయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విడుదలైన 'ANI Podcast' ఇంటర్వ్యూలో సాంగే మాట్లాడుతూ, ఈ విషయాన్ని తనకు ఓ మాజీ ఉన్నత స్థాయి చైనా అధికారి తెలిపారని వెల్లడించారు. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక సమాచారం గానీ, వైద్య నివేదికలు గానీ అందుబాటులో లేవు. జిన్పింగ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అతని ముఖకవళికలు, నడక తీరులో మార్పులు వచ్చాయని సాంగే పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన 'మెంటల్ ఫాగ్' (మానసిక మందకొడితనం) ఎదుర్కొంటున్నారని, దాంతో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇటీవల చైనాలో సీనియర్ మిలిటరీ జనరల్స్, రక్షణ మంత్రులను పదవుల నుంచి తొలగించడం లేదా వారు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడానికి జిన్పింగ్ మానసిక ఒత్తిడే కారణమని సాంగే అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, చైనాలో జిన్పింగ్ తర్వాతి వారసుడు ఎవరనేది పెద్ద ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు. చైనాలో ఓ శక్తివంతమైన పాలకుడ్ని తన వారసుడిని ప్రకటిస్తే, ఆ వారసుడే తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది.. అలాగని ప్రకటించకపోతే పాలకుడు దిగిపోయాక అధికారం కోసం అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని.. అందుకే జిన్పింగ్ తన వారసుడిని ప్రకటించడానికి వెనుకాడుతున్నారని సాంగే విశ్లేషించారు.
లోబ్సాంగ్ సాంగే ఎవరు?
లోబ్సాంగ్ సాంగే 2011 నుంచి 2021 వరకు ధర్మశాలలోని 'సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్' కు ఎన్నికైన రాజకీయ అధిపతిగా (సిక్యోంగ్) పనిచేశారు. ప్రస్తుతం హార్వర్డ్ లా స్కూల్లో సీనియర్ విజిటింగ్ ఫెలోగా ఉన్న ఆయన, చైనా విధానాలపై దీర్ఘకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
For More National News And Telugu News