పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:46 AM
నేడు వరలక్ష్మీ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయాలో కొలువుదీరిన శ్రీపురుహూతికా దేవి అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు.
కాకినాడ, సెప్టెంబర్ 04: నేడు వరలక్ష్మీ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయాలో కొలువుదీరిన శ్రీపురుహూతికా దేవి అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో వారంతా సామూహిక వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారు. దాదాపు 12 వేల మంది ఆడపడుచులు ఈ వ్రతంలో పాల్గొనున్నారు. ఈ వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, చీర, రూపుతో కూడిన కానుకను జనసేన నాయకులు అందించారు.
అంతకుముందు ఈ దేవాలయంలో అమ్మవారికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కేకే పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈ పూజా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెండెం దొరబాబు, తుమ్మలబాబు పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరో వైపు చివరి శ్రావణ శుక్రవారం కావడం.. మహిళా భక్తులు పోటెత్తనుండంతో.. ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ వ్రతం ఆచరించడానికి వచ్చే మహిళలను ఐదు బ్యాచ్లుగా ఆలయ అధికారులు విభజించారు. ఈ పాదగయ క్షేత్రం.. అష్టాదశ శక్తి పీఠాలలో పదవదిగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే.