నీటిని ఆయుధంగా వాడొద్దు.. ఎస్సీఓ వేదికపై పాక్ ప్రధాని షెహబాజ్ వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 01 , 2026 | 07:08 PM
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందంపై హేగ్లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty)పై హేగ్లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రస్తావించారు. నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు (India Pakistan water dispute).
ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. నీరు లక్షలాది మంది జీవితాలకు ఆధారమని, వ్యవసాయానికి కీలకమని, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే వనరని అన్నారు. నీటిని ఆయుధంగా ఉపయోగించడానికి అనుమతించకూడదని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి జల వనరులను ఒక దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు (Shehbaz Sharif about Indus Waters Treaty).
షెహబాజ్ షరీఫ్ జల వివాదాన్ని ప్రస్తావించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎస్సీఓ సదస్సులో ప్రసంగించారు (Pakistan water dispute). ఆయన ప్రసంగంలో ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి నిధులు అందించడం, ఉగ్రవాదుల నియామకం, ఉగ్ర స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని కూడా ప్రధాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..
విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..