భారత్ ఎన్నికల విధానంపై ట్రంప్ ప్రశంసలు.. అమెరికాలోనూ తప్పనిసరి ఓటర్ ఐడీకి పట్టు..
ABN , Publish Date - Aug 18 , 2026 | 08:45 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. అమెరికాలో ఓటర్ల గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని కోరుతూ, భారత్లో అమలవుతున్న ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. అమెరికాలో ఓటర్ల గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని కోరుతూ, భారత్లో అమలవుతున్న ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపించారు. అమెరికా ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణను తప్పనిసరి చేసే 'సేవ్ అమెరికా చట్టం'ను ఆమోదించాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు (Donald Trump about India Voter ID System).
భారత్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇటీవల అమెరికా ఎన్నికల విధానంపై తమను ప్రశ్నించారని ట్రంప్ తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని జ్ఞానేశ్ కుమార్ అడిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్లో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్ పేర్కొన్నారు. వారిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని, ప్రతి ఓటరుకూ చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమైందని ఆయన అన్నారు. ఈ విధానాన్ని అమెరికాలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు (Indian Election System).
అమెరికాలో ఎన్నికల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ, ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా గుర్తింపు పత్రం తప్పనిసరి చేయడం, పోస్టల్ ఓటింగ్పై ఆంక్షలు విధించడం వంటి ప్రతిపాదనలు 'సేవ్ అమెరికా చట్టం'లో ఉన్నాయి (SAVE America Act). ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే ఈ బిల్లుపై అమెరికా రాజకీయ నాయకుల్లో ఏకాభిప్రాయం లేదు. డెమొక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. దీంతో బిల్లు ఆమోదం దిశగా స్పష్టమైన పురోగతి కనిపించలేదు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్.. పోలీస్ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..