ఫిలిప్పీన్స్లోని ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:08 AM
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
మనీలా, సెప్టెంబర్ 10: ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 87 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంలో 42 మందిని రక్షించినట్లు వివరించారు. వారిలో 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చెప్పారు.
బుధవారం సాయంత్రం ఎం/వి జూన్ అస్టర్ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫెర్రీలో సంభవించిన అగ్నిప్రమాదం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారని వివరించారు. మనీలా నుంచి ఈ ఫెర్రీ బయలుదేరిందని పేర్కొన్నారు. కోరన్ (Coron) మున్సిపాలిటీలోని బారంగే మార్సిల్లా తీరానికి సమీపంలో రాగానే ఫెర్రీలో మంటలు చెలరేగాయిని కోస్ట్గార్డ్ ఉన్నతాధికారి తెలిపారు.