నేపాల్లో 20 హెలికాప్టర్లతో సహాయక చర్యలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:57 PM
నేపాల్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల నేపాల్ సైన్యం తాళ్ల వంతెనలు నిర్మిస్తోంది. 20 హెలికాప్టర్లను మోహరించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 5: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా ఇప్పటివరకు 1,344 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. నేపాల్ సైన్యం చేపట్టిన తాత్కాలిక వంతెన నిర్మాణం, 20 హెలికాఫ్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరదల కారణంగా నేపాల్లోని నువాకోట్ జిల్లాలో తాడి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారి నెట్వర్క్ తెగిపోయింది. దీంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయిన ప్రజలకు సహాయం అందించేందుకు సైనిక ఇంజినీరింగ్ విభాగాలు రోప్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నాయి.
మరోవైపు గాలింపు, సహాయక చర్యలు, ఆహార పదార్థాల పంపిణీ కోసం నేపాల్ సైన్యం సుమారు 20 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అత్యంత ప్రతికూల వాతావరణం, ఎత్తైన పర్వత ప్రాంతాలు, వరదల వల్ల హెలిప్యాడ్లు దెబ్బతిన్నప్పటికీ, ప్రాణాలను పణంగా పెట్టి వైమానిక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చిలిమ్ టన్నెల్లో భారత విపత్తు సహాయక బృందం నిరంతర శ్రమ
రసువా జిల్లాలో సంభవించిన కొండచరియలు, తీవ్ర వరదల కారణంగా చిలిమ్ టన్నెల్ పూర్తిగా నీట మునిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత టన్నెల్ రెస్క్యూ టీమ్, నేపాల్ సైన్యంతో కలిసి సంయుక్తంగా పనిచేస్తోంది. భూగర్భ మార్గాల్లో నిలిచిపోయిన నీటిని తోడేసి, మరింత లోతుగా తవ్వకాలు జరిపి టన్నెల్ను సురక్షితంగా మార్చేందుకు భారత నిపుణులు సాంకేతిక సాయం అందిస్తున్నారు.
భారీ యంత్రాలను నేరుగా టన్నెల్ వద్దకు తీసుకువెళ్లడానికి తాత్కాలిక రహదారిని కూడా నిర్మిస్తున్నారు. నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ఈ వివరాలను వెల్లడిస్తూ, నేపాల్కు అవసరమైన పూర్తి సాంకేతిక సాయం, మానవతా దృక్పథంతో కూడిన ఆదుకునే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, భారత బృందంలోని వైద్యధికారులు స్థానిక గ్రామీణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అత్యవసర మందులను పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్క్రీన్ టైమ్ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..
ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్
For More National News And Telugu News