ఇరాక్పై ఇరాన్ డ్రోన్ల దాడి.. అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్లు
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:37 AM
ఉత్తర ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది.
ఎర్బిల్, జూలై 28: ఉత్తర ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్లో మంగళవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు దాడులు చేయడంతో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అల్ జజీరా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్బిల్కు ఈశాన్యంగా ఉన్న ఖలీఫాన్, సోరాన్ ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై నాలుగు ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడుల ఫలితంగా ఆయా ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి. దాడులకు పాల్పడిన రెండు డ్రోన్లు లక్షిత ప్రాంతాలకు సమీపంలోనే కూలిపోయినట్లు సమాచారం.
మరోవైపు, ఎర్బిల్ నగరం అంతటా ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇందులో అమెరికా కాన్సులేట్ సమీపంలోని ప్రాంతాలు కూడా ఉన్నాయని ఇరాకీ స్థానిక మీడియాను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదించింది.
ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో, అమెరికా తక్షణమే స్పందించింది. దాడి జరిగిన వెంటనే పదికి పైగా అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు ఎర్బిల్ ఆకాశంలో గస్తీ కాస్తున్నాయి. ఈ డ్రోన్ దాడులతో పాటు, ఇరాక్ అంతటా విస్తృత సైనిక కార్యకలాపాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ (IRIB) కథనం ప్రకారం అల్ అన్బార్ ప్రావిన్స్లో ఒక అమెరికా డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాకీ వర్గాలు తెలిపాయి. హదీతా డ్యామ్ సమీపంలో కూలిన అమెరికా డ్రోన్ చిత్రాలను స్థానిక మీడియా ప్రచురించింది. సులేమానియాలోని ఖోర్ మోర్ గ్యాస్ ఫీల్డ్పై కూడా దాడి జరిగినట్లు ఐఆర్ఐబీ నివేదించింది.
ఈ ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలమైతే, ఇరాన్పై 'చాలా బలమైన సైనిక చర్య'ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.
మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు, పలు ప్రాంతీయ ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు, చర్చలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రణాళికాబద్ధమైన అమెరికా దాడులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు.
చర్చలకు మరో అవకాశం ఇవ్వడానికి తాత్కాలికంగా దాడులను నిలిపివేసినట్లు ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. ఇరాన్తో విస్తృత అణు ఒప్పందంపై చర్చలను పునరుద్ధరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు ట్రంప్ చెప్పారు. ఈ చర్చలలో ఇరాన్, ఒమన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఖతార్, పాకిస్థాన్, ఈజిప్ట్ దేశాలతో పాటు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇరాన్తో చాలా లోతైన చర్చలు జరుపుతున్నామని, అవి సఫలం కాకపోతే, తిరిగి చాలా బలమైన సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ అన్నారు. దౌత్యానికి ఎంత సమయం ఇస్తారని అడిగిన ప్రశ్నకు, 'ఎక్కువ సమయం లేదు. ఇది వేగంగా జరగాలి, లేదంటే అస్సలు జరగదు' అని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్లో పర్యటిస్తున్నారు. ట్రంప్తో సమావేశం కానున్న నెతన్యాహు, ఇరాన్ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవాలని నెతన్యాహు పట్టుబడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News