Share News

పశ్చిమాసియాలో కీలక అడుగు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం

ABN , Publish Date - Jun 04 , 2026 | 07:23 AM

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. వాషింగ్టన్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

పశ్చిమాసియాలో కీలక అడుగు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం
Israel, Lebanon Agree to Implement Ceasefire

ఆంధ్రజ్యోతి, మే 4: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. అమెరికా మధ్యవర్తిత్వంలో దాదాపు తొమ్మిది గంటలపాటు వాషింగ్టన్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్ - లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే, ఈ శాంతి ఒప్పందం పూర్తిగా హిజ్‌బొల్లా సాయుధ దళాల చర్యలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

లెబనాన్‌లోని 'సౌత్ లిటానీ' (South Litani Sector) ప్రాంతం నుంచి హిజ్‌బొల్లా సాయుధ బలగాలు పూర్తిగా తప్పుకోవాలి. అలాగే ఇజ్రాయెల్‌పై హిజ్‌బొల్లా జరిపే దాడులను పూర్తిగా నిలిపివేయాలి. అలా జరిగితేనే ఈ కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాలపై ఏ ఇతర సాయుధ సంస్థల ప్రమేయం లేకుండా, కేవలం లెబనాన్ అధికారిక సైన్యం (Lebanese Armed Forces) మాత్రమే పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. లెబనాన్ సైన్యం తన సార్వభౌమాధికారాన్ని దేశవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా అమెరికా తగిన సైనిక, వ్యూహాత్మక మద్దతును అందిస్తుంది.


లెబనాన్ వ్యాప్తంగా హిజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, వారిని నిరాయుధులను చేయడం ద్వారానే తమ దేశ భద్రత సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. మరోవైపు, అంతర్జాతీయంగా గుర్తించిన తమ దేశ సరిహద్దులను గౌరవించాలని, ప్రాంతీయ సమగ్రత, పూర్తి ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని లెబనాన్ కోరింది.

ఈ చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ఉమ్మడిగా పశ్చిమాసియాలో ఇరాన్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. హిజ్‌బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇస్తూ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న ఇరాన్ చర్యలను అన్నిపక్షాలూ తీవ్రంగా ఖండించాయి.

ప్రస్తుతానికి ఈ ఒప్పందం ద్వారా తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించినప్పటికీ, ఇరు దేశాల మధ్య శాశ్వత, సమగ్ర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వీలుగా జూన్ 22 నుంచి మరోసారి రాజకీయ, భద్రతాపరమైన ఉన్నత స్థాయి చర్చలు జరపాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అప్పటివరకు ఇరు దేశాల మధ్య సమన్వయకర్తగా అమెరికా వ్యవహరించనుంది.

Israel,-Lebanon-Agree-to-Im.jpg


ఇవి కూడా చదవండి

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

డిస్కమ్‌లకు ఇంధన ‘సర్దు’బాటు

Updated Date - Jun 04 , 2026 | 08:54 AM