డిస్కమ్లకు ఇంధన ‘సర్దు’బాటు
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:32 AM
నియంత్రించడానికి వీల్లేని కారణాలతో ఏ నెలలో అయ్యే వ్యయాలను... అదే నెలలో వసూలు చేసుకోవడంలో జాప్యం జరిగితే......
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): నియంత్రించడానికి వీల్లేని కారణాలతో ఏ నెలలో అయ్యే వ్యయాలను... అదే నెలలో వసూలు చేసుకోవడంలో జాప్యం జరిగితే... ఏడాది చివర్లో ట్రూ-అప్ పేరిట క్లెయిమ్ చేసుకోవడానికి డిస్కమ్లకు అవకాశమిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రతీ నెల వినియోగదారుడి నుంచి యూనిట్కు రూ.0.30లకు మించకుండా వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల డిస్కమ్లకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. ఇప్పటిదాకా ఏ నెలలో అయ్యే అదనపు వ్యయాన్ని అదే నెలలో డిస్కమ్లు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, తాజా రెగ్యులేషన్స్ ప్రకారం రూ.300 కోట్లు దాటిన పనులను కీలకం, అత్యవసరమని గుర్తిస్తే ట్రాన్స్కో స్వయంగా చేసుకునే అవకాశం కలుగనుంది. ఇప్పటిదాకా రూ.50 కోట్ల నుంచి రూ.300 కోట్లలోపు పనులకు మాత్రమే అనుమతి ఉంది.