అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!
ABN , Publish Date - Apr 11 , 2026 | 08:11 AM
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 11: అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ వేదికగా జరగనున్న చర్చల కోసం ఇస్లామాబాద్ నగరం సర్వసన్నద్ధమైంది. అత్యంత కీలకమైన ఈ శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం రాజధాని నగరంలో ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
నగరం లాక్డౌన్.. పకడ్బందీ భద్రత
శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్కు చేరుకున్న అత్యున్నత స్థాయి ప్రతినిధుల రక్షణ కోసం అధికారులు నగరాన్ని దాదాపుగా లాక్డౌన్ చేశారు. కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. ప్రధాన రహదారులను మూసివేసి, కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. వేల సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ దళాలను నగరవ్యాప్తంగా మోహరించారు.
రెండు రోజుల పబ్లిక్ హాలిడే
భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి, చర్చల సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ సమయంలో విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

దశాబ్దాల కాలం తర్వాత అమెరికా - ఇరాన్ మధ్య ఇంతటి ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన, హార్ముజ్ జలసంధి వంటి కీలక అంశాలపై ఈ చర్చల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చలు విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇటు అంతర్జాతీయ మీడియా, అటు ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్ వైపు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి