Share News

సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..

ABN , Publish Date - Aug 09 , 2026 | 03:56 PM

సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..
Saudi Oil Refinery

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది (Houthis Attack Saudi Aramco).


జజాన్ ప్రాంతంలోని అరామ్‌కో కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ అధికారులు తెలిపారు. అయితే మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై సౌదీ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించలేదు (Saudi Arabia Houthis).


జజాన్‌లోని అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు తాజాగా హౌతీలు ప్రకటించారు. సౌదీ అరేబియాపై తమ సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడి చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్ల చొరబాటుకు ప్రతిస్పందనగానే ఈ దాడి చేసినట్టు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీ తెలిపారు (Houthi Drone Attack).


కాగా, ఈ ఘటనకు కేవలం రెండు రోజుల ముందే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌లు సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి (Saudi Oil Refinery). ఈ ఒప్పందం ప్రకారం ఒక సభ్య దేశంపై జరిగిన సాయుధ దాడిని మిగిలిన సభ్య దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సౌదీ చమురు కేంద్రంపై హౌతీల తాజా దాడి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.


ఇవి కూడా చదవండి

నీళ్లు లేకున్నా వేల ఎకరాలు పెంచారు!

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ‘కథే’ వేరు!

Updated Date - Aug 09 , 2026 | 04:44 PM